చిత్తూరు వెళ్ళినప్పుడు మా బంధువులైన శీకాయపట్టెడ కె. సుదర్శనం గారిని కలిసిన విషయం గత టపాలో వ్రాశాను. వారిప్పుడు తెలుగు విద్యార్థులు ఆంగ్లం మాట్లాడేటప్పుడు సాధారణంగా వచ్చే ఉచ్చారణా దోషాలను సరిచేస్తూ తెలుగు పద్యాల శతకం వ్రాసే పనిలో ఉన్నారు. మచ్చుకు కొన్ని వినిపించి ఎలా వున్నాయని అడిగారు. నాకనిపించిందేమిటంటే నేటి విద్యార్థులకు ఆంగ్ల పదాల ఉచ్చారణ కంటే ఆ పద్యాలలోని తెలుగు పదాల ఉచ్చారణే కష్టమేమోనని. బహుశ పద్యాల్లోని తెలుగు పదాల అర్థాలు తెలుసుకొనేందుకు వాటిలోని ఆంగ్ల పదాలు సహాయపడతాయి. ‘రివర్సు డిక్షనరీ’ లాగా అన్నమాట. అలా పద్యాలతో పుస్తకం వ్రాస్తే ఏ మాత్రం మార్కెట్ ఉంటుందో కూడా అనుమానమే. పద్యాలకు బదులు “అర గంటలో ఆంగ్ల ఉచ్చారణ” అని టైటిల్ పెట్టి ఇంగ్లీషు-తెలుగు పదాల లిస్టు వ్రాసేసి ప్రచురిస్తే కొంత మార్కెట్ కావచ్చు. ఐతే పుస్తకం ప్రచురించి మార్కెట్ చేసుకోవాలన్నది వారి ఉద్దేశ్యం కాదు గనుక, కనీసం తెలుగు పద్యాల వైవిధ్య భరితమైన ఉపయోగాలను ముందు తరాల వారికి పరిచయం చేయడం కోసమైనా శతకాన్ని పూర్తిచేయమని చెప్పాను. వారి పద్యాలలో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను:
1.
’సో’ యనగా విత్తుట యగు
’సో’ యనగా కుట్టుటయును సోమోత్తంసా
’సౌ’ యన వారాహి యగున్
’సూయిజ్జ’న చెత్త, రొచ్చు; ’సూయరు’ తూమౌ
(1.Sow 2. Sew 3. Sow 4. Sewage 5. Sewer)
2.
‘విన్యడ’న ద్రాక్షతోటగు
‘అన్యన్’ నీరుల్లి యగు, త్రియంబక! శంభో!
‘సాన్యా‘, ‘సోన్యా‘ సమమౌ
‘సిన్యోర్‘ అన మిస్టరిటలి,’సిన్యోరా‘ స్త్రీ
(Vineyard; Onion; Sonia; Signor; Signora)
3.
‘రో‘ యన వరుసకు జెల్లును
‘రో‘ యనగా తెడ్ల పడవ ద్రోసి నడపుటౌ
‘రౌ‘ యనగా యలజడి యగు
‘రౌ‘ యన గద్దించుటయును రౌప్య గిరీశా!
(Row)
4.
‘వుమన‘న స్త్రీకినిఁ బేరగు
‘విమిన‘న బహువచనమగును విమలేందు ధరా!
‘జెమినై‘ యన ‘జెమిని‘ యనన్
యమకంబును, మిథున రాశి హైమవతీశా!
(Woman; Women; Gemini)
5.
‘బో‘ యన వింటికి నామము
‘బో‘ యనగా నింద్రధనుసు, ముడికినిఁ బేరౌ
‘బౌ‘ యనగ నమస్కారము
‘బౌ‘ యనగా వినతుడగుట పశ్యత్ఫాలా!
(Bow)
6.
‘నైకీ‘ యన జయదేవత
‘సైకీ‘ యన మనసు, నాత్మ; సద్యోజాతా!
‘వైకౌంట‘న నొక తెగ దొర
‘సైకైయేట్రిస్టు‘ మానస వ్యాధి భిషక్
(Nike; Psyche; Viscount; Psychiatrist)
7.
ఫిలిమనకుము ‘ఫిల్మ‘నవలె
‘లలబై‘ యన లాలి, ‘ఏల్కలై‘ క్షారమగున్
‘ఇలినోయ్‘ అమెరిక రాష్ట్రము
‘పలీసు‘ సరి, పోలిసనకు బాలేందు ధరా!
(Film; Lullaby; Alkali; Illinois; Police)
8.
‘సాలస్‘ అన నోదార్చుట
‘పేలిట్‘ అన అంగుడౌను విశ్వాధారా!
‘పాలన్‘ అన పుప్పొడి యగు
‘వేలంటైన్‘ లేఖ, కాన్క ప్రియులకు ముద్దౌ
(Solace; Palate; Pollen; valentine)
9.
మహిళనొక్కతె ‘మేడమ‘ని పిల్వగా వలె
బహుత ‘లేడీస‘న పలుక వలయు
‘బాలే‘ యనగ గీతభర నృత్య నాటిక
‘అవన‘ని పల్కంగ నగును ప్రొయ్యి
‘మెషరు‘, ‘మిరాష‘న మితి, మృగతృష్ణయౌ
‘బీటు‘కు పాస్టెన్సు ‘బీటు‘ మాత్ర
మాంగ్ల పదంబున నాస్తి ద్విత్వపు వాక్కు
కుక్కరనగ రాదు ‘కుకర‘న వలె
‘ప్రీమడాన‘ ముఖ్య నృత్యగాయని యౌను
‘గ్లాసు‘, ‘గ్లేస‘నంగ గాజు పేరు
‘ప్లాంటు‘, ‘ప్లేంట‘నంగ పరగు మొక్కకు పేర్లు
ఆశుతోష! ఈశ! అట్టహాస!
(Madam; Ladies; Ballet; Oven; [ష-zha] Measure;
Mirage; Beat; Beat (past tense); Cooker;
Prima Donna; Glass; Plant)
ఎలా ఉన్నాయంటారు!
వృత్తిగత వ్యవహారాల్లో లోతుగా కూరుకుపోయి నాకో బ్లాగుందని మర్చిపోయేంత పనయ్యింది. కొన్ని నెలల విరామం తరువాత ఇవ్వాళ బ్లాగు చూస్తే బావురుమంటూ కనిపించింది:-( “గవర్నమెంటు కంపెనీలో ఉజ్జోగం అయింది కదా, ఇంకేం, అంతా తీరికే నీకు!” అని వేళాకోళమాడిన స్నేహితుల్నందరినీ మైసూరుకు ఛార్జీలిచ్చి పిలిచి మరీ తన్నాలని ఉందిగానీ వారిలో చాలామంది ఇప్పుడు అమెరికాలో బోలెడంత తీరుబాటున్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఛార్జీలిచ్చి పిలవడం కుదిరేపని కాదు.
ఇంత పనిఒత్తిడిలోనూ, దీపావళికి మావూరు, చిత్తూరికి వెళ్ళడం కుదిరింది. ఇంకెన్నాళ్ళు చిత్తూరు ’మా వూరు’ గా ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి మాత్రం ఆ గాలి నా వయసును పాతికేళ్ళు తగ్గించేస్తూ ఉంటుంది. చిత్తూరును ’చిత్తమున్న ఊరు’ అని చమత్కరించారు సినారె గారొక సారి. నిజానికి ’చిరు + ఊర్’ -> ’చిట్రూర్’ అనే తమిళ పదం వాడుకలో చిత్తూరుగా మారింది. ’చిన్న ఊరు’ అని అర్థం. చిత్తూరు చిన్న ఊరైతే మరి పెద్ద ఊరేది? ప్రక్కనే ఉన్న ’వేలూర్’ నగరం (ఆంధ్రుల వాడుకలో రాయవెల్లూరు). ఆంధ్ర రాష్ట్రం అవతరించిన చాలా యేళ్ళవరకు కూడా చిత్తూరు తమిళనాడులో ఉండేది. ఇప్పుడైనా సాంస్కృతిక పరంగా చిత్తూరు తమిళ పట్టణమే. అందుకే మా ఊరి ప్రజలందరూ రెండు భాషలూ (కలగలిపేసి) మాట్లాడుతారు. “కూలికి పిండి ఆడబడును”, “తలముడి నరకబడును” వంటి బోర్డులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తూ ఉంటాయి. ఎన్టీయార్ కూడలి ఉన్నట్లే ఎంజీయార్ రోడ్డు కూడా కనిపిస్తుంది. ఏ తమిళ సినిమా ఐనా మొదటిరోజున ఇక్కడ రిలీజ్ కావలసిందే. అయితే మా జిల్లా వాసులెప్పుడూ తెలంగానంలాగా విడిపోయే పాట ఆలపించినట్లు లేదు, అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నా. బహుశ చిత్తూరు ప్రజలెప్పుడూ ఆంధ్ర ప్రభుతమీద ఏ ఆశలూ పెట్టుకోలేదు. ఏ హైకోర్టు కేసు ఉంటేనో, సెక్రటేరియట్లో పని ఉంటేనో లేక ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటేనో తప్ప చిత్తూరు వాసులెవ్వరూ హైదరాబాద్ గురించి తలవనైనా తలవరు. నేను హైదరాబాద్ చూడడం ఎంసెట్ కౌన్సిలింగ్ అప్పుడే. మాకు సిటీ అంటే చెన్నై లేక బెంగుళూరు. అంత దూరం వద్దనుకుంటే వేలూరు. కనుక రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశంలో ఉన్నా తమిళనాడులో ఉన్నా పెద్ద తేడా యేమీ లేదని అందరూ అనుకున్నట్లుంది. ఇప్పుడిప్పుడే పట్టణం పెరుగుతుండడం వలన రాజకీయాలు కూడా పెరుగుతున్నాయి.
తమిళ మాసమైన ’ఆడి’ నెలలో కృత్తికా నక్షత్రం వచ్చేరోజు చాలా పవిత్రమైనది. ఆరోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలన్ని క్రిక్కిరిసి పోతాయి. చిత్తూరు ప్రజ కావిళ్ళెత్తుకోని దగ్గరలోనే ఉన్న తిరుత్తణి క్షేత్రానికి బయలుదేరుతారు. చిత్తూరు బస్టాండు ప్రాంతం పసుపురంగు బట్టలేసుకున్న వాళ్ళతో ’మహానాడు’ ను మరిపిస్తుంది. సమస్యేమిటంటే మురుగన్ పాటలన్నీ చాలావరకు తమిళభాషలోనే ఉంటాయి.’కావడి చిందు’ అనే ఒక ప్రత్యేక తాళగతిలో సాగే ఈ పాటలు అందెలు చేతబట్టి చిందులేయడానికి అనువుగా ఉంటాయి. తెలుగు మాత్రమే తెలిసిన పాటక జనం ఈ పాటలను అతికష్టంమీద నేర్చుకొని పాడుతుంటే వినడానికి తమాషాగా ఉండేది మా చిన్నప్పుడు. “పంది రెండు కొయ్యా … తోళ్ల మురుగయ్యా” అని భక్తి పారవశ్యంతో చిందులు వేస్తున్న వారిని చూసి ’తోళ్ళ మురుగయ్యేమిటి? పందిని కొయ్యడమేమిటి? దేవుడిని అలా అనడం తప్పుకాదా!’ అని ఆశ్చర్యపడి పోయే వాళ్ళం. తరువాత పెద్దలు చెప్పేవారు: అది “పణ్ణిరెండు కయ్యా… తోழ் మురుగయ్యా” అనే తమిళ పాట యొక్క అపభ్రంశ రూపమని.’పన్రెండు చేతులవాడా, కాపాడు మురుగా, తండ్రీ’ అని భావం. ఇలాంటి భాషాభాసాలు, భాషాహాసాలు బోలెడన్ని మా వూళ్ళో.
ఈ దీపావళినాడు చిత్తూరులో ఉన్న మా బంధువులు శీకాయపట్టెడ కె. సుదర్శనం గారి ఇంటికి వెళ్ళాం. ఆయన తమిళం, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల్లో విశేషంగా అధ్యయనం చేసినవారు. ప్రస్తుతం ఆంగ్ల పదాలకు సరియైన ఉచ్చారణను తెలుగు పద్యాల్లో విద్యార్థులకు తెలియజెప్పడానికి ఒక శతకం వ్రాసే ప్రయత్నం చేస్తున్నారు (ఆ వివరాలు మరో టపాలో). మాటల సందర్భంలో ఆయన ఒక కథ చెప్పారు.
ఒక పండితుడు దేశాటనం చేస్తూ పండితులను వాదంలో ఓడిస్తూ ఒక రాజ్యానికి వచ్చాడట. ఆ రాజ్యంలోని ఆస్థాన విద్వాంసునితో రాజుగారు పోటీ ఏర్పాటు చేశారట. పండితుని ప్రతిభను గురించి వినివున్న ఆస్థాన విద్వాంసుడు పోటీకి భయపడి అతడిని భయపెట్టడానికి ఒక ఎత్తు వేశాడట. రేపు పోటీ అనగా ఆ సాయంత్రం విద్వాంసుని భార్య తమ పనిమనిషితో కలిసి పండితుడు బసచేసిన సత్రం వద్దనున్న బావి వద్దకు నీళ్ళకోసం వెళ్ళింది. పండితుడు అరుగుమీద కూర్చున్న సమయం చూసి పనిమనిషి ’అమ్మగారూ, సాయంత్రం కూర ఏం చేయమంటారు?’ అని అడిగింది. దానికి ఆస్థాన విద్వాంసుని భార్య ఈ క్రింది శ్లోకం చెప్పింది:
” మత్కుణం నదీ సంయుక్తం
గోపత్నీ సింధు సంయుతం
విచార ఫల సంయుక్తం
గ్రామ చూర్ణం కరిష్యతాం “
అది విన్న పని మనిషి ’అలాగేనండీ అమ్మగారూ’ అంటూ అక్కడినుండి నిష్ర్కమించింది. ఈ శ్లోకం వింటున్న పండితునికి ఆ వంటేమిటో ఏమీ అర్థం కాలేదు. వచ్చి నీళ్ళబిందె చంకనెత్తుకొంటున్న విద్వాంసుని భార్యను అడిగాడు ఆ శ్లోకం అర్థం ఏమిటని. ’మా వూరి అమ్మలక్కలు మాట్లాడుకొనే మాటలకే అర్థం తెలియని వారు రేపు మా ఆస్థాన విద్వాంసునితో ఏం పోటీ పడతారు!’ అని పరిహాసం చేసి వెళ్ళి పోయిందావిడ. ఇంకేముంది, పండితుడు పలాయనం చిత్తగించడం, ఆస్థాన విద్వాంసుడు ఊపిరి పీల్చుకోవడం జరిగిపోయాయి.
ఇంటికి వెళ్ళిన ఆ ఇల్లాలు భర్తను అడిగింది- ఆ వంటేమిటని. ఆస్థాన విద్వాంసుడు నవ్వి ఇలా చెప్పాడు:
మత్కుణం = నల్లి; నదీ = ఏరు ; నల్లి + ఏరు = నల్లేరు
గో = ఆవు; పత్నీ = ఆలు ; ఆవు + ఆలు = ఆవాలు
సింధు = ఉప్పు
విచార = చింత ; ఫలం = పండు ; విచార ఫలం = చింతపండు
గ్రామ = ఊరు ; చూర్ణం = పిండి; గ్రామ చూర్ణం = ఊరుబిండి
’అంటే చింతపండు, ఆవాలు, ఉప్పు వేసి నల్లేరు ఊరుబిండి చేయి అని దాని అర్థం. తెలుగు పదాలను ముక్కకు ముక్కగా సంస్కృతంలో అనువదించి చెప్పాను’ అన్నాడట ఆయన. భర్త చమత్కారానికి ఆశ్చర్యపోయిందా ఇల్లాలు.
చిత్తూరులో మాట్లాడే తెలుగు, తమిళం కూడా ఇలాగే ఉంటాయని మీరనుకుంటే ఆ తప్పు మీది కాదు
శ్రీ మహా విష్ణువు పురుషోత్తముడా లేక చిల్లర దేవుడా అన్న మీమాంస ఈ మధ్య బ్లాగుల్లో తలయెత్తింది.ఎవరి వాదానికి వారు ఋగ్వేదం నుండి మొదలుపెట్టి కొకు గారి సాహిత్యం వరకు రిఫరెన్సులు ఇవ్వడం జరిగింది.
నిజానికి పరిశీలిస్తే విష్ణువు ఒక చిల్లర దేవుడిగానే మిగిలిపోయినట్లు ఘట్టిగా నిదర్శనాలు కన్పిస్తున్నాయి. అందుకోసం ఋగ్వేదందాకా వెళ్ళనవసరం లేదు.”ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతె గాని, మొదటినుండియు నీవు దామోదరుడవె” అని మొన్న మొన్న నే మన కాసుల పురుషోత్తమ కవి విష్ణువును వెటకారం చేశాడు. పోనీ అంత ప్రఖ్యాతి తెచ్చిన ఆండ్రు బిడ్డలైనా ఆయన చెప్పుచేతల్లో ఉన్నట్లు కనపడదు. అందరికీ సిరులిచ్చే లక్ష్మీ దేవి ఇల్లాలయి వుండీ పాపం పెళ్ళి ఖర్చులకు కుబేరుడి దగ్గర అప్పుచేయాల్సి వచ్చిందంటే ఎంత చిల్లర బ్రతుకైపోయిందో చూడండి. ICICI వారి క్రెడిట్ కార్డు లోను లాగా ఎంతకీ ఆ అప్పు తరగడం లేదు. అందరూ విష్ణువును మాయావి అంటారు, వైష్ణవ మాయ అని అబ్బురంగా చెప్పుకొంటారు. కానీ పరిశీలనగా చూస్తే ఆయనంత వెర్రి వెంగళప్ప మరొకరున్నట్లు కనబడదు. పాలసముద్రం నుండి వచ్చిన గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆయన తీసేసుకొని విషం మాత్రం శివునికిచ్చేశాడని లోకులు ఆడిపోసుకుంటారు. చిలికినంత సేపూ ఆయనే కూర్మంగా మారి అంత పెద్ద కొండనీ నడుం విరిగేలా మోసిన విషయాన్ని మాత్రం కన్వీనియెంట్ గా మరిచిపోతారు. శివుని సాహసం ప్రచారం అయినంతగా విష్ణువు మోసిన భారం విషయం మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. శివుడు విషం మింగితే అది గొంతు దిగకుండా అయన సతీమణి పీక పట్టుకుని బ్రతికించింది. అదే విష్ణువు మింగి ఉంటే ఏమయ్యేది? ఆయన భార్య కూడా ఆయనలాగే ఒక పిచ్చిమాలోకం. తనకు ఒక్క మాట చెప్పకుండా, చెంగు పుచ్చుకొని పరుగెత్తినా, పాపం ఎవరికే కష్టమో అని మౌనంగా వెనక పరుగెత్తిందే కాని, “ఆ భక్తుడేమైనా నిన్ను బొట్టుపెట్టి పిలిచాడా! రావే ఈశ్వరా అంటే శివుడు వెళ్ళాలి గాని నువ్వెందుకు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావ”ని అని ఒక్క మాటా ఆడి యెరుగదు కదా. అందరూ భోళా శంకరుడంటారు గానీ నిజానికి శివుడికున్నంత గడుసుదనం విష్ణువుకెక్కడిది? శివుని కుటుంబం చూడండి. భార్య ఆది శక్తి. పెద్ద కొడుకు గణాధిపతి. చిన్న కొడుకు దేవతల సైన్యాధ్యక్షుడు. తానో, స్వయంగా భూతనాధుడు.ఇలా దేవతల, భూతాల, పిశాచాల, ప్రమథ గణాల నాయకత్వమంతా తమకుటుంబంలోనే పెట్టుకొని కుటుంబ పాలనకు ఆద్యుడైన వాడు శివుడు. తనవారికంటూ ఒక్క పోస్టైనా ఇప్పించుకోలేని వాడు, ఎప్పుడూ తననే కీర్తిస్తూ తిరిగే మనవడు నారదుడు పాపం ముల్లోకాలూ పట్టుకు తిరుగుతుంటే వైకుంఠంలో కనీసం ఒక 30 x 40 సైటన్నా ఇప్పించి ఓ ఇంటివాడిని చేయలేనివాడు చిల్లరదేవుడుగాక మరేమౌతాడు!
పరిశీలనగా చూస్తే శివుడి వంశం విష్ణువు కుటుంబంపై ఒక పథకం ప్రకారం సాగించిన కుట్ర కోణాలు ఆవిష్కృతమౌతాయి. విష్ణువు కుటుంబంనుండి ఒక గొప్ప పోస్టునలంకరించిన బ్రహ్మదేవుని తలకాయను శివుడు ఆ అమ్మ తోడుగా అడ్డంగా నరికేసి ఆ కపాలాన్ని తన భోజనపాత్రగా మార్చుకొన్నాడు. బ్రహ్మకు ఇంకా నాలుగు తలలుండి బ్రతికిపోయాడు కానీ లేకుంటే ఏమై ఉండేది! అంత ఘోరం చేసిన శివుని అదేమనైనా ప్రశ్నించలేదు పాపం ఆ విష్ణువు. అది అలుసుగా తీసుకొని ఇంకో మానస పుత్రుడు మన్మధుని ఉత్తి పుణ్యానికి కాల్చి బూడిద చేశాడు. అంత జరిగినా శివుని పల్లెత్తి మాటనలేదు సరిగదా ఆయన పెళ్ళి దగ్గరుండి మరీ జరిపించాడా చిల్లర దేవుడు. లక్ష్మీదేవి సోదరుడైన చంద్రుని ఏదో ఒక వంక దొరికించుకొని శపించాడు వినాయకుడు. విష్ణువాహనుడైన పాపానికి గరుత్మంతుడి ఆహారమైన పాములు, ఎలుకలకు అండనిచ్చి గరుడుడు ఆహారానికి కటకటలాడేలా చేశారు. విష్ణువు కూతురైన గంగ పైనుండి దూకితే కిడ్నాప్ చేసినంత పని చేసి తన జటాజూటంలో కట్టి పడేశాడు శివుడు. ఇన్ని జరిగినా శివుడి కుటుంబంపై విష్ణువేమీ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లు కనపడదు. ఒక ఫ్యాక్షనిస్టుకున్న కసి, తెగువ కూడాలేని విష్ణువు చిల్లరదేవుడే అయివుండాలనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.
ఋగ్వేదంలో ఆయనను గురించి “సహస్ర శీర్షాత్ పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్” అని వ్రాశారంటే విని మోసపోకండి. అందులోని లొసుగులను ఎత్తి చూపండి. సహస్ర శీర్షాలున్నప్పుడు, ద్విసహస్ర నేత్రాలు, ద్విసహస్ర పాదాలు ఉండాలి గానీ అవీ సహస్రమే ఎలా ఉంటాయి ? అని ప్రశ్నించండి. అందుకే ఈ వేద విజ్ఞానమంతా పుక్కిటి పురాణం అని గతితార్కిక భౌతికవాదం మద్దతు లేకుండానే చెప్పొచ్చు. వెయ్యి తలలకీ వెయ్యి కళ్ళే ఉన్న విష్ణువు ఒక్క తలకు మూడు కళ్ళున్న శివునితో పోల్చితే, ఆ మాటకొస్తే తలకు వేయి కళ్ళున్న ఇంద్రునితో పోలిస్తే చిల్లర దేవుడు కాక మరేమవుతాడూ? అందుకే విష్ణువుని ఉపేంద్రుడన్నారేమో!
ఇన్ని చెప్పినా విష్ణువు చిల్లరదేవుడని మీరు నమ్మకపోతే అది ఖచ్చితంగా వైష్ణవ మాయే!
(గమనిక: ఇదంతా నా అభిప్రాయం మాత్రమేననీ, ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించలేదనీ మనవి. తిట్టాలంటే నన్నే తిట్టండి-ఇతరులను కాదు)

నా కొత్త పాఠ్యపుస్తకం
కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసేవారికి రాజభాషా ప్రవేశం కల్పించడం కోసం గృహ మంత్రిత్వ శాఖ మూడు స్థాయిలలో శిక్షణ నిర్వహిస్తుంది. ప్రబోధ్, ప్రవీణ్, ప్రాఙ్ఞ (హిందీలో “ప్రాగ్య “) అని పరీక్షలుంటాయి. మొదటిది ప్రాథమిక స్థాయి, అచ్చులు, హల్లులనుండి మొదలు పెట్టి వాక్య నిర్మాణం వరకూ నేర్పుతారు. రెండవ దానిలో, వ్యాకరణం, వచన రచన, ఉత్తరాలు గట్రా వ్రాయడం ఉంటాయి. చివరి స్థాయిలో సాధారణం గా ప్రభుత్వ పరిపాలనా సంబంధిత విషయాలు, ఫైళ్ళ నోటింగులు ఎలా వ్రాయాలి, పరిపాలనలో వాడే పదాల అనువాదాలు మొదలైనవి ఉంటాయి. ప్రస్తుతం నేను రెండవ స్థాయి పరిక్షకు సిద్ధమవుతున్నాను. పరీక్ష నవంబరులో. భారతీయ భాషా సంస్థ (CIIL) లో వారానికి ఒక్క రోజు తరగతులు. పుస్తకాలు పుచ్చుకొని ’మళ్ళీ బడికి’ బయలుదేరాము.
మాకు పాఠాలు చెప్పే మాస్టారి పేరు టేక్ చంద్. హర్యానా నుండి వచ్చారు. మొదటిరోజు కనుక పాఠాలజోలికి పోకుండా, హిందీ గురించి ఎన్నో సరదా సంగతులు చెప్పారు. అన్నింటికన్న నన్ను అబ్బురపరచిన విషయం, హిందీలో “ఐ, ఔ” అన్న అచ్చులు లేవన్న మాట. దక్షిణ భారతీయులు సంస్కృత ప్రభావం వలన దేవనాగరి లిపిలోని అక్షరాలను సంస్కృత అచ్చులతో సమానంగా ఉచ్చరిస్తారు కానీ, శుద్ధహిందీలో ’ఎ, ఏ, ఒ, ఓ’ అనే అచ్చులు మాత్రమే ఉన్నాయని, ’ఐ, ఔ’ అన్న అచ్చులు లేవని చెప్పారు. ’ఐశ్వర్య’ అన్న మాటను హిందీలో ’ఏశ్వర్య’ అన్నట్లు పలకాలని, ’ఔరత్’ ను ’ఓరత్’ అని పలకాలని చెప్పి, అలా పలికి వినిపించారు. మాతో కూడా అలా పలికించారు. ఈ ఉచ్ఛారణ సంగతి ఇంతవరకు ఎక్కడా నేను నేర్చుకోలేదు. అలా ఈ తరగతులకు రావడం వలన నాకు హిందీ లో ’అ,ఆ’ లే ఇంకా సరిగ్గా రావన్న విషయం అర్థమైంది. మనకంతా వచ్చని విర్రవీగకుండా బుద్ధిగా పాఠాలు నేర్చుకోవడానికి ఈ తొలిక్లాసు ఉపకరించింది.
కొంత కాలం క్రితం ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక చర్చ వచ్చింది. విజ్ఞాన శాస్త్ర విషయాలను తెలుగులో అర్థమయ్యేలా చెప్ప వచ్చా అని. ముఖ్యంగా భౌతిక శాస్త్ర సూత్రాలను తెలుగులో ఎలా అనువాదం చేయగలమని. మాటల్లో అతనన్నాడు, హాస్యంగా: ‘ సూత్రాలను పద్యాల్లో చెప్పితే ఇంకా తమాషాగా ఉంటుందేమో’ అని. నిజంగానే పద్యాల్లో ఛందస్సు వలన ఒక తూగు, ఒక సౌష్ఠవ రూపం ఉంటుందని, అందు వలననే కవుల వచన సాహిత్యం కంటే పద్య సాహిత్యం జనుల నాలుక పై ఎక్కువగా ఆడుతుంటుందనీ, సూత్రాలను పద్యాల్లో చెబితే గుర్తుంచుకోవడం సులభం కావచ్చనీ నేనన్నాను. “ఐతే కెప్లర్ నియమాల్ని పద్యాల్లో చెప్పు చూద్దాం” అని సవాలు విసిరాడా మిత్రుడు. నేనూ అందుకొని సూత్రాలను అనువాదం చేయడం ప్రారంభించాను. కెప్లరు గ్రహగతి నియమాలు ఇవీ (ఆంగ్లంలో) :
Kepler Laws of Planetary Motion:
1. Every Planet revolves around the sun in an elliptical orbit, with the sun at one of its foci.
2. The areal velocity of the radius vector is constant. In other words, the line joining the planet with the sun will sweep equal areas in equal intervals of time.
3. the square of the time period (time taken by planet to complete one revolution around the sun) is inversely proportional to the cube of the semi-major axis of its orbit.
చూస్తే చాలా కష్టమే అనిపించింది. ఐనా ధైర్యం తెచ్చుకొని పై నియమాలకు నా అనువాదం ఇలా ప్రారంభించాను:
౧.
ప్రతి గ్రహము యినుని చుట్టును
గతి దప్పక దీర్ఘవృత్త కక్ష్యను దిరుగున్
సతతము యుండును భానుడు
అతివృత్తపు రెండు నాభులందొక దానిన్
౨.
సర్వ స్థితులందు వ్యాసార్థ సదిశ రేఖ
యొక్క విస్తీర్ణ వేగమ్ము యొకటె గాని
మారదచు వచించె కెప్లరు, గ్రహముల
గమనమంతయు నియమ బధ్ధమని చాటె
౩.
గ్రహ భ్రమణ కాల వర్గము
గ్రహ కక్ష్యకు చెందు అర్థ గుర్వక్షమ్మున్ …
మూడో నియమం వద్దకు వచ్చేసరికి కలం ఆగిపోయింది. రెండో పాదంలో యతి తన్నేసిందని గుర్తు పట్టగానే ఇక ఆలోచనలు ముందుకు కదల్లేదు.
కనుక చదువుతున్న బ్లాక్కవి వరులకు నా విన్నపం ఏమిటంటే, మూడో నియమం కాస్తా అనువాదం చేసి పుణ్యం కట్టుకోండి. అలాగే ఫిజిక్సుకు, ఛందస్సుకు ఏమైనా ఫ్యూజన్ జరిగే అవకాశముందేమో ఆలోచించండి .

