చిల్లర శ్రీ మహావిష్ణువు

2009 జులై 18
kmcmohan చే

శ్రీ మహా విష్ణువు పురుషోత్తముడా లేక చిల్లర దేవుడా అన్న మీమాంస ఈ మధ్య బ్లాగుల్లో తలయెత్తింది.ఎవరి వాదానికి వారు ఋగ్వేదం నుండి మొదలుపెట్టి కొకు గారి సాహిత్యం వరకు రిఫరెన్సులు ఇవ్వడం జరిగింది.

నిజానికి పరిశీలిస్తే విష్ణువు ఒక చిల్లర దేవుడిగానే మిగిలిపోయినట్లు ఘట్టిగా నిదర్శనాలు కన్పిస్తున్నాయి. అందుకోసం ఋగ్వేదందాకా వెళ్ళనవసరం లేదు.”ఆండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతె గాని, మొదటినుండియు నీవు దామోదరుడవె” అని మొన్న మొన్న నే మన కాసుల పురుషోత్తమ కవి విష్ణువును వెటకారం చేశాడు. పోనీ అంత ప్రఖ్యాతి తెచ్చిన ఆండ్రు బిడ్డలైనా ఆయన చెప్పుచేతల్లో ఉన్నట్లు కనపడదు. అందరికీ సిరులిచ్చే లక్ష్మీ దేవి ఇల్లాలయి వుండీ పాపం పెళ్ళి ఖర్చులకు కుబేరుడి దగ్గర అప్పుచేయాల్సి వచ్చిందంటే ఎంత చిల్లర బ్రతుకైపోయిందో చూడండి. ICICI వారి క్రెడిట్ కార్డు లోను లాగా ఎంతకీ ఆ అప్పు తరగడం లేదు. అందరూ విష్ణువును మాయావి అంటారు, వైష్ణవ మాయ అని అబ్బురంగా చెప్పుకొంటారు. కానీ పరిశీలనగా చూస్తే ఆయనంత వెర్రి వెంగళప్ప మరొకరున్నట్లు కనబడదు. పాలసముద్రం నుండి వచ్చిన గొప్ప గొప్ప వస్తువులన్నీ ఆయన తీసేసుకొని విషం మాత్రం శివునికిచ్చేశాడని లోకులు ఆడిపోసుకుంటారు. చిలికినంత సేపూ ఆయనే కూర్మంగా మారి అంత పెద్ద కొండనీ నడుం విరిగేలా మోసిన విషయాన్ని మాత్రం కన్వీనియెంట్ గా మరిచిపోతారు. శివుని సాహసం ప్రచారం అయినంతగా విష్ణువు మోసిన భారం విషయం మార్కెటింగ్ చేసుకోలేకపోయాడు. శివుడు విషం మింగితే అది గొంతు దిగకుండా అయన సతీమణి పీక పట్టుకుని బ్రతికించింది. అదే విష్ణువు మింగి ఉంటే ఏమయ్యేది? ఆయన భార్య కూడా ఆయనలాగే ఒక పిచ్చిమాలోకం. తనకు ఒక్క మాట చెప్పకుండా, చెంగు పుచ్చుకొని పరుగెత్తినా, పాపం ఎవరికే కష్టమో అని మౌనంగా వెనక పరుగెత్తిందే కాని, “ఆ భక్తుడేమైనా నిన్ను బొట్టుపెట్టి పిలిచాడా! రావే ఈశ్వరా అంటే శివుడు వెళ్ళాలి గాని నువ్వెందుకు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావ”ని అని ఒక్క మాటా ఆడి యెరుగదు కదా. అందరూ భోళా శంకరుడంటారు గానీ నిజానికి శివుడికున్నంత గడుసుదనం విష్ణువుకెక్కడిది? శివుని కుటుంబం చూడండి. భార్య ఆది శక్తి. పెద్ద కొడుకు గణాధిపతి. చిన్న కొడుకు దేవతల సైన్యాధ్యక్షుడు. తానో, స్వయంగా భూతనాధుడు.ఇలా దేవతల, భూతాల, పిశాచాల, ప్రమథ గణాల నాయకత్వమంతా తమకుటుంబంలోనే పెట్టుకొని కుటుంబ పాలనకు ఆద్యుడైన వాడు శివుడు. తనవారికంటూ ఒక్క పోస్టైనా ఇప్పించుకోలేని వాడు, ఎప్పుడూ తననే కీర్తిస్తూ తిరిగే మనవడు నారదుడు పాపం ముల్లోకాలూ పట్టుకు తిరుగుతుంటే వైకుంఠంలో కనీసం ఒక 30 x 40 సైటన్నా ఇప్పించి ఓ ఇంటివాడిని చేయలేనివాడు చిల్లరదేవుడుగాక మరేమౌతాడు!

పరిశీలనగా చూస్తే శివుడి వంశం విష్ణువు కుటుంబంపై ఒక పథకం ప్రకారం సాగించిన కుట్ర కోణాలు ఆవిష్కృతమౌతాయి. విష్ణువు కుటుంబంనుండి ఒక గొప్ప పోస్టునలంకరించిన బ్రహ్మదేవుని తలకాయను శివుడు ఆ అమ్మ తోడుగా అడ్డంగా నరికేసి ఆ కపాలాన్ని తన భోజనపాత్రగా మార్చుకొన్నాడు. బ్రహ్మకు ఇంకా నాలుగు తలలుండి బ్రతికిపోయాడు కానీ లేకుంటే ఏమై ఉండేది! అంత ఘోరం చేసిన శివుని అదేమనైనా ప్రశ్నించలేదు పాపం ఆ విష్ణువు. అది అలుసుగా తీసుకొని ఇంకో మానస పుత్రుడు మన్మధుని ఉత్తి పుణ్యానికి కాల్చి బూడిద చేశాడు. అంత జరిగినా శివుని పల్లెత్తి మాటనలేదు సరిగదా ఆయన పెళ్ళి దగ్గరుండి మరీ జరిపించాడా చిల్లర దేవుడు. లక్ష్మీదేవి సోదరుడైన చంద్రుని ఏదో ఒక వంక దొరికించుకొని శపించాడు వినాయకుడు. విష్ణువాహనుడైన పాపానికి గరుత్మంతుడి ఆహారమైన పాములు, ఎలుకలకు అండనిచ్చి గరుడుడు ఆహారానికి కటకటలాడేలా చేశారు. విష్ణువు కూతురైన గంగ పైనుండి దూకితే కిడ్నాప్ చేసినంత పని చేసి తన జటాజూటంలో కట్టి పడేశాడు శివుడు. ఇన్ని జరిగినా శివుడి కుటుంబంపై విష్ణువేమీ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించినట్లు కనపడదు. ఒక ఫ్యాక్షనిస్టుకున్న కసి, తెగువ కూడాలేని విష్ణువు చిల్లరదేవుడే అయివుండాలనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.

ఋగ్వేదంలో ఆయనను గురించి “సహస్ర శీర్షాత్ పురుష:, సహస్రాక్ష స్సహస్ర పాత్” అని వ్రాశారంటే విని మోసపోకండి. అందులోని లొసుగులను ఎత్తి చూపండి. సహస్ర శీర్షాలున్నప్పుడు, ద్విసహస్ర నేత్రాలు, ద్విసహస్ర పాదాలు ఉండాలి గానీ అవీ సహస్రమే ఎలా ఉంటాయి ? అని ప్రశ్నించండి. అందుకే ఈ వేద విజ్ఞానమంతా పుక్కిటి పురాణం అని గతితార్కిక భౌతికవాదం మద్దతు లేకుండానే చెప్పొచ్చు. వెయ్యి తలలకీ వెయ్యి కళ్ళే ఉన్న విష్ణువు ఒక్క తలకు మూడు కళ్ళున్న శివునితో పోల్చితే, ఆ మాటకొస్తే తలకు వేయి కళ్ళున్న ఇంద్రునితో పోలిస్తే చిల్లర దేవుడు కాక మరేమవుతాడూ? అందుకే విష్ణువుని ఉపేంద్రుడన్నారేమో!

ఇన్ని చెప్పినా విష్ణువు చిల్లరదేవుడని మీరు నమ్మకపోతే అది ఖచ్చితంగా వైష్ణవ మాయే!

(గమనిక: ఇదంతా నా అభిప్రాయం మాత్రమేననీ, ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించలేదనీ మనవి. తిట్టాలంటే నన్నే తిట్టండి-ఇతరులను కాదు)

మళ్ళీ బడికి!

2009 జులై 15
kmcmohan చే

నా కొత్త పాఠ్యపుస్తకం

నా కొత్త పాఠ్యపుస్తకం

వెంటనే హిందీ ప్రవీణ్ పరీక్షకు చదివి పాస్ కమ్మని పైవారి నుండి తాఖీదు వచ్చింది నాకు, మా బాసుకు. మాకు ఎంతో కొంత హిందీ వచ్చుకదా మళ్ళీ పరీక్షలెందుకని నసిగాం, కానీ వినలేదు. ఈ సంవత్సరం ఇంత మందిని హిందీ ప్రవీణులను చేస్తామని పార్లమెంటుకు హామీ ఇవ్వడం జరిగింది గనుక, వారి  రికార్డుల ప్రకారం  హిందీ ప్రావీణ్యం మాకున్నట్లు ఏ ధ్రువపత్రాలూ లేవు గనుక, మేము అర్జంటుగా క్లాసులకెళ్ళి హిందీ నేర్చుకొని ప్రవీణ్ పరీక్ష పాసు కావలసిందేనని నిష్కర్షగా చెప్పిన తరువాత, ఇక చేసేదేం లేక తరగతులకు సిద్ధమయ్యాము.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసేవారికి రాజభాషా ప్రవేశం కల్పించడం కోసం గృహ మంత్రిత్వ శాఖ మూడు స్థాయిలలో శిక్షణ నిర్వహిస్తుంది. ప్రబోధ్, ప్రవీణ్, ప్రాఙ్ఞ (హిందీలో  “ప్రాగ్య “) అని పరీక్షలుంటాయి. మొదటిది ప్రాథమిక స్థాయి, అచ్చులు, హల్లులనుండి మొదలు పెట్టి వాక్య నిర్మాణం వరకూ నేర్పుతారు. రెండవ దానిలో, వ్యాకరణం, వచన రచన, ఉత్తరాలు గట్రా వ్రాయడం ఉంటాయి. చివరి స్థాయిలో సాధారణం గా ప్రభుత్వ పరిపాలనా సంబంధిత విషయాలు, ఫైళ్ళ నోటింగులు ఎలా వ్రాయాలి, పరిపాలనలో వాడే పదాల అనువాదాలు మొదలైనవి ఉంటాయి. ప్రస్తుతం నేను రెండవ స్థాయి పరిక్షకు సిద్ధమవుతున్నాను. పరీక్ష నవంబరులో. భారతీయ భాషా సంస్థ (CIIL) లో వారానికి ఒక్క రోజు తరగతులు. పుస్తకాలు పుచ్చుకొని ’మళ్ళీ బడికి’ బయలుదేరాము.

మాకు పాఠాలు చెప్పే మాస్టారి పేరు టేక్ చంద్. హర్యానా నుండి వచ్చారు. మొదటిరోజు కనుక పాఠాలజోలికి పోకుండా, హిందీ గురించి ఎన్నో సరదా సంగతులు చెప్పారు. అన్నింటికన్న నన్ను అబ్బురపరచిన విషయం, హిందీలో “ఐ, ఔ” అన్న అచ్చులు లేవన్న మాట. దక్షిణ భారతీయులు సంస్కృత ప్రభావం వలన దేవనాగరి లిపిలోని అక్షరాలను సంస్కృత అచ్చులతో సమానంగా ఉచ్చరిస్తారు కానీ, శుద్ధహిందీలో ’ఎ, ఏ, ఒ, ఓ’ అనే అచ్చులు మాత్రమే ఉన్నాయని, ’ఐ, ఔ’ అన్న అచ్చులు లేవని చెప్పారు. ’ఐశ్వర్య’ అన్న మాటను హిందీలో ’ఏశ్వర్య’ అన్నట్లు పలకాలని, ’ఔరత్’ ను ’ఓరత్’ అని పలకాలని చెప్పి, అలా పలికి వినిపించారు. మాతో కూడా అలా పలికించారు. ఈ ఉచ్ఛారణ సంగతి ఇంతవరకు ఎక్కడా నేను నేర్చుకోలేదు. అలా ఈ తరగతులకు రావడం వలన నాకు హిందీ లో ’అ,ఆ’ లే ఇంకా సరిగ్గా రావన్న విషయం అర్థమైంది. మనకంతా వచ్చని విర్రవీగకుండా బుద్ధిగా పాఠాలు నేర్చుకోవడానికి ఈ తొలిక్లాసు ఉపకరించింది.

తెలుగు లో ఫిజిక్స్ ?! (లేక ఫిజిక్స్ లో తెలుగు?!) అను సంవాదము

2009 జూన్ 7

కొంత కాలం క్రితం ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక చర్చ వచ్చింది. విజ్ఞాన శాస్త్ర విషయాలను తెలుగులో అర్థమయ్యేలా చెప్ప వచ్చా అని. ముఖ్యంగా భౌతిక శాస్త్ర సూత్రాలను తెలుగులో ఎలా అనువాదం చేయగలమని. మాటల్లో అతనన్నాడు, హాస్యంగా: ‘ సూత్రాలను పద్యాల్లో చెప్పితే ఇంకా తమాషాగా ఉంటుందేమో’ అని. నిజంగానే పద్యాల్లో ఛందస్సు వలన ఒక తూగు, ఒక సౌష్ఠవ రూపం ఉంటుందని, అందు వలననే కవుల వచన సాహిత్యం కంటే పద్య సాహిత్యం జనుల నాలుక పై ఎక్కువగా ఆడుతుంటుందనీ, సూత్రాలను పద్యాల్లో చెబితే గుర్తుంచుకోవడం సులభం కావచ్చనీ నేనన్నాను. “ఐతే కెప్లర్ నియమాల్ని పద్యాల్లో చెప్పు చూద్దాం” అని సవాలు విసిరాడా మిత్రుడు. నేనూ అందుకొని సూత్రాలను అనువాదం చేయడం ప్రారంభించాను. కెప్లరు గ్రహగతి నియమాలు ఇవీ (ఆంగ్లంలో) :

Kepler Laws of Planetary Motion:


1. Every Planet revolves around the sun in an elliptical orbit, with the sun at one of its foci.

2. The areal velocity of the radius vector is constant. In other words, the line joining the planet with the sun will sweep equal areas in equal intervals of time.

3. the square of the time period (time taken by planet to complete one revolution around the sun) is inversely proportional to the cube of the semi-major axis of its orbit.


చూస్తే చాలా కష్టమే అనిపించింది. ఐనా ధైర్యం తెచ్చుకొని పై నియమాలకు నా అనువాదం ఇలా ప్రారంభించాను:

౧.
ప్రతి గ్రహము యినుని చుట్టును
గతి దప్పక దీర్ఘవృత్త కక్ష్యను దిరుగున్
సతతము యుండును భానుడు
అతివృత్తపు రెండు నాభులందొక దానిన్

౨.
సర్వ స్థితులందు వ్యాసార్థ సదిశ రేఖ
యొక్క విస్తీర్ణ వేగమ్ము యొకటె గాని
మారదచు వచించె కెప్లరు, గ్రహముల
గమనమంతయు నియమ బధ్ధమని చాటె

౩.
గ్రహ భ్రమణ కాల వర్గము
గ్రహ కక్ష్యకు చెందు అర్థ గుర్వక్షమ్మున్ …

మూడో నియమం వద్దకు వచ్చేసరికి కలం ఆగిపోయింది. రెండో పాదంలో యతి తన్నేసిందని గుర్తు పట్టగానే ఇక ఆలోచనలు ముందుకు కదల్లేదు.

కనుక చదువుతున్న బ్లాక్కవి వరులకు నా విన్నపం ఏమిటంటే, మూడో నియమం కాస్తా అనువాదం చేసి పుణ్యం కట్టుకోండి. అలాగే ఫిజిక్సుకు, ఛందస్సుకు ఏమైనా ఫ్యూజన్ జరిగే అవకాశముందేమో ఆలోచించండి .

భాషలతో ఒక రోజు

2009 జూన్ 1

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ప్రతిచోటా టోలిక్ (TOLIC – Town Official Language Implementation Committee) అనే సమితి ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు అందులో సభ్యులు.ఊళ్ళోని ఏదో ఒక పెద్ద సంస్థ టోలిక్ కు అధ్యక్షత వహిస్తుంది.ఈ TOLIC ను హిందీలో నరాకాస్ అంటారు – ‘నగర రాజ్ భాషా కార్యాన్వయన్ సమితి’ అన్న మాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజభాష ఐన హిందీ ని ఎంతవరకు అమలు చేస్తున్నాయో రివ్యూ చేసి పార్లమెంటుకు రిపోర్టు చేయడం, హిందీ అమలుకు సూచనలివ్వడం ఈ సమితి పనులు. మైసూరులో భారతీయ భాషా సంస్థాన్ (Central Institute of Indian Languages – CIIL) ఈ సమితి కి అధ్యక్షత వహిస్తుంది. మా కార్యాలయంలో ఈ రాజభాషా అమలు సమన్వయకుడి పదవి నాది (Official Language Coordinator). ఆ బాధ్యతల రీత్యా నేను నెలకోసారి భారతీయ భాషా సంస్థాన్ కు వెళ్ళవలసి వస్తుంది.

గత సోమవారం మధ్యాహ్నం సమావేశానికి CIIL నుండి పిలుపు వచ్చింది . ఆ ముందురోజే బ్లాగుల్లో భాషా చర్చలతో బుర్ర వేడెక్కి ఉండడాన ఆఫీసులో కూడా అవే అలోచనలతో ఉన్న నాకు అదేరోజు భాషల నిలయానికి వెళ్ళవలసి రావడం యాదృచ్ఛికమే ఐనా ఆలోచనలనుండి కొంత విముక్తి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎగ్గొట్టకుండా వెళ్ళాను. హిందీ అమలు గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్యమనస్కంగా ఉన్ననాకు పెద్దగా తలకెక్కడం లేదు. సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ రాజేష్ సచ్ దేవ , CIIL ఉప సంచాలకులు, ఈ విషయం గమనించినట్లు నాకప్పుడు తెలియలేదు. సమావేశం ముగిసిన తరువాత దగ్గరకు పిలిచి అడిగారు – ” ఇక్కడ లేవు నువ్వు ఏమిటి సంగతి?” అని. ఎలాగూ అడిగారు కదా అని భాష గురించి నాక్కొన్ని ప్రశ్నలున్నాయని చెప్పాను. ఆయన కూడా కొంత తీరిగ్గా ఉండడంతో కాసేపు వివరంగా మాట్లాడారు మా సంభాషణలో ఆయన చెప్పిన సంగతులు, యథాతథంగా కాకుండా, నా మాటల్లో క్రింద వ్రాస్తున్నా:

అసలు అధికార భాషంటే ఏమిటి అన్న దానికి సచ్ దేవ గారి వివరణ:

అధికార భాష అన్నది మూడు రకాలు:

1. Legislative Official Language : పరిపాలనా సౌలభ్యం కోసం శాసన పూర్వకంగా ప్రభుత్వం అదేశించిన అధికార భాష. మన దేశంలో హిందీ లాగా.

2. Symbolic Official Language : ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన అధికార భాష, ఆంధ్ర ప్రదేశ్ లో ఉర్దూ లాగా, పాండిచ్చేరిలో ఫ్రెంచి లాగా – ఒక వర్గాన్ని సంతోష పరచడంకోసం ఒక భాషను అధికారభాషగా లాంఛనంగా ప్రకటిస్తారు గానీ నిజానికి ఆ భాషలో అధికారిక కార్య కలాపాలేవీ జరగవు.

౩. Working Official Language : ఇది ఎవరైతే అధికారిక కార్య కలాపాలు నిర్వహిస్తారో వారికి అనువుగా ఉండే భాష అన్నమాట. మన దేశంలో ఆంగ్ల భాష లాగా. ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ భాషలోనే అన్ని అధికారిక పత్రాలూ వెలువడుతాయి.

ఈ మూడు రకాల అధికార భాషలూ ఏ దేశంలో నైతే ఒకే భాషగా ఉంటుందో అది భాషా పరంగా ఎంతో సౌలభ్యం ఉన్న దేశం అన్నమాట. చాలా వరకు ఐరోపా దేశాలు,అమెరికా(ఉత్తర,దక్షిణ), చైనా, తూర్పు ఆసియా దేశాలు, అరబ్బు దేశాలు ఈ కోవలోకి వస్తాయి.

ఆఫ్రికాలో లాంఛనంగా ప్రతి దేశానికీ ఓ అధికార భాష ఉంటుంది కానీ, నిజానికి దైనందిన కార్యకలాపాలన్నీ ఆంగ్లంలోనో, ఫ్రెంచిభాషలోనో జరుగుతాయి. అక్కడ సామాన్య ప్రజలకు , పాలనాధికారులకు మధ్య భాష పెద్ద అంతరాన్నే సృష్టిస్తుంది.

ఇక మూడవ దానికి ఉదాహరణ మనదేశమే. అనేక భాషా సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఆంగ్లం అప్రకటిత అధికార భాషగా స్థిరపడిపోయింది. రాజ్యాంగంలో కేవలం కొంతకాలం పాటు , హిందీ అధికార భాషగా నిలద్రొక్కుకొనేంత వరకు ఒక ‘లింక్ లాంగ్వేజ్’ గా వాడమని చెప్పిన భాష ఈనాడు తొలగించ వీలుకాని దశకు చేరుకొంది.

హిందీ భాష రాజ భాషగా ఎందుకు ఇంకా నిలద్రొక్కుకోలేదు అన్నదానికి ఆయన విశ్లేషణ ఇది:

హిందీని అధికార భాషగా పెట్టినప్పుడు పెద్దలకు తెలుసు. ఇతర భారతీయ భాషలు హిందీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాయని, ఆయా భాషల ప్రజలు అంత తొందరగా హిందీని అంగీకరించరనీ. ఇతర భారతీయ భాషలన్నింటినుండీ పదాలను స్వీకరించి కలుపుకుంటూ హిందీ ఒక కొత్త భారతీయ భాష, భారతీయులందరి భాషగా అవతరించాలని ఆశ్వాసించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఇతర భారతీయ భాషలనుండి చెప్పుకోదగ్గ సంఖ్యలో పదాలేవీ హిందీలో చేరలేదు. దానితో బాటే ఆ భాష కొన్ని భాషల ప్రజలను చేరలేదు. ప్రభుత్వం గత యాభై యేళ్ళుగా హిందీని ఒక సర్వశక్తిమంతమైన భాషగా అభివృధ్ధి పరచడంలో విఫలమైంది. నేటికి కూడా ఒక ఇంజనీరింగ్ గానీ వైద్య శాస్త్రంగానీ హిందీలో చదవగలిగే అవకాశంలేదు. ఎందుకూ పనికిరాని జాతీయ భాషను ఎవరైనా ఎందుకు పనిగట్టుకొని నేర్చుకొంటారు? చైనా, ఇజ్రాయెల్, కొరియా, చివరికి మన చుట్టుప్రక్కలున్న సింహళం, థాయ్ లాంటి భాషలు కూడా హిందీకంటే అభివృధ్ధి చెందాయి.

హిందీ అమలుకు నియుక్తమైన కమిటీలన్నీ, “అన్ని భారతీయ భాషా పదాలనూ” అన్న రాజ్యాంగ కర్తల మాటలను ప్రక్కన పెట్టేశారు. ‘జనని సంస్కృతమ్ము సకలభాషలకును’ అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకొని సంస్కృత పదాలను కలిపేస్తే, అన్ని భాషల పదాలను కలిపేసినట్టే కదా అని అతితెలివిగా అలోచించి బోలెడన్ని సంస్కృత పదాలను హిందీలోకి తరలించేశారు (అంటే రాజభాష ఐన హిందీ అన్నమాట). అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న సామెతగా అలా కృత్రిమంగా తయారైన రాజభాష, అటు హిందీ మాతృభాషగా కలవారికీ మింగుడు పడక, అటు హిందీయేతర జనుల మన్ననలూ పొందక రెండికీ చెడింది. ఉదాహరణకు కొన్ని హిందీ పదాలు, హిందీ మాతృభాషగా కలవారు ఉపయోగించేవి-రాజభాషా నిఘంటువులు చెప్పేవి:

ప్రజా వ్యవహారంలోని హిందీ———-రాజభాష (శుధ్ధ్‌ హిందీ)———–తెలుగు మాట

ఇంత్ జామ్ కర్నా ——————-ప్రబంధ్ కర్నా———————-సిధ్ధం చేయడం (prepare)
ఇంత్ జార్ కర్నా———————ప్రతీక్షా కర్నా———————–వేచి ఉండడం (wait)
ఔర్——————————— ఏవం —————————–మరియు (and)
మగర్——————————–పరంతు————————– కానీ (but)
కార్ఖానా——————————సంయంత్ర్————————కర్మాగారం (plant/ factory)

ఇలా ఎన్నో. ఈ రెండవ నిలువు వరుస లోని హిందీ భాషను హిందీరాష్ట్రాల్లో వారెవ్వరూ వారి దైనందిక వ్యవహారంలో గానీ, సాహిత్య సృష్టిలో గానీ వాడరు. అది కేవలం ప్రభుత్వ పత్రాలకే పరిమితం ఐపోయిన ఒక కృతక భాష. ఇతర భాషీయులకు కొంత సులభమైనా వారు ఈ భాష నేర్చుకొన్నందువలన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఉత్తరాదిలో ఆ రెండో వరుసలోని భాషను వాడితే వాడు హిందీయేతర జాతీయుడని రూఢిగా తెలిసిపోతుంది. వాళ్ళు నవ్వుకోవడానికితప్ప అనుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆ భాష పనికిరాదు. అలా మన రాజ భాష, రాజ భాషగానే మిగిలిపోయింది గానీ ప్రజలకు , వింధ్యకు రెండువైపులనున్నవారికీ, చేరువకాలేక పోయింది.

ఐనా హిందీ భాష పెరుగుతోంది. భాషాభివృధ్ధికి చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ వాటి లక్ష్యాలను అందుకోలేక పోయినా సరే, హిందీ భాష విస్తరిస్తోంది. 2001 జనగణన వివరాల ప్రకారం దేశంలో 40% ప్రజలకు హిందీ మాతృభాష ఐతే మరో 25% మంది హిందీని ద్వితీయ భాషగా వాడుతున్నారు. కనీసం మరో పది శాతం ప్రజలకు హిందీలో కనీస పరిజ్ఞానం ఉంది. మరి ఈ విస్తరణ ఎలా జరిగింది? బాలీవుడ్ వలన, హిందీ టీవీ ఛానెళ్ళ వలన! ఎందుకంటే అవి ప్రజల భాష మాట్లాడాయి. బలవంతపు శాసనాల ద్వారా కాక, సాంస్కృతిక సంబంధాలద్వారా ప్రజలకు దగ్గరయ్యింది. ఈనాడు టివీ ఛానెళ్ళలో సీరియళ్ళు చూస్తూనే దక్షిణ భారత మహిళలు హిందీ నేర్చుకొంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక సన్నివేశాన్ని వివరించారు – సచ్ దేవా గారు కన్నడ భాషావాది ఐన ప్రముఖ కన్నడ రచయిత లింగదేవరు హళెమనె గారి యింటికి వెళ్ళినప్పుడు ఆయనతో ఆయన కూతురు దెబ్బలాడుతోందట. ‘ టివీలో నేను హిందీ కార్యక్రమాలే చూస్తాను, కన్నడ కార్యక్రమాలొద్దు’ అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో తన యీడు పిల్లలందరూ హిందీ సీరియళ్ళ గురించే చర్చించుకొంటారట. అవి చూడకపోతే స్నేహితులతో మాట్లాడుకోవడానికి కామన్ విషయం దొరకదట. ఇలాంటి సామాజిక అవసరాలే భాషాభివృధ్ధికి దోహదం చేస్తాయి గానీ, శాసనాల ఒత్తిడులు కావని చెప్పారు.

ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు – ఆ మధ్య ఆయన తమిళనాడులో UGC వారి సమావేశంలో పాల్గొన్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్లలో ఎంతమందికి హిందీ వచ్చని అడిగారట. 22 మందిలో ముగ్గురు మాత్రమే తమకు హిందీ వచ్చని చెప్పారట. వారిలో ఎందరు తమ పిల్లలకు హిందీ నేర్పాలనుకుంటున్నారని అడిగారట. అందరూ చెయ్యెత్తడమే కాదు, తమ పిల్లలకు ఇప్పటికే హిందీలో ప్రవేశం ఉందని అందరూ చెప్పారట. తమిళనాడులో కూడా హిందీ పట్ల తగ్గుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని అన్నారు.

మరి చిన్నభాషలు ప్రమాదంలో పడవా? అని అడిగాను నేను. CIIL, భాషల ఆస్పత్రి వంటిదనీ, అక్కడ ప్రతియేటా ఎన్నో భాషల చావులు చూస్తామనీ చెప్పారు. మానవ పరిణామ క్రమంలో భాషల పుట్టడం, అంతరించడం సహజ పరిణామమనీ, అందులో మనం పెద్దగా చేయగలిందేమీ లేదనీ ఆయన అభిప్రాయం. కోయ, చెంచు వంటి గిరిజన భాషలు మాట్లాడే వారు, బ్రతుకు తెరువుకోసం, వారుంటున్న రాష్ట్రపు భాషను నేర్చుకోవడం, రాష్ట్రపు భాషను మాట్లాడే వారు, మరింత మొబిలిటీ కోసం హిందీ నేర్చుకోవడం, హిందీ మాట్లాడే వారు మంచి ఉద్యోగావకాశాలకోసం ఆంగ్లం నేర్చుకోవడం, కొన్ని తరాల తరువాత తమ వారసత్వపు భాషలకు దూరమైపోవడం మామూలే. అలా కాకుండా ఉండాలంటే వారికి తమ భాషను మర్చిపోకుండా ఉండేందుకు, అదనపు శ్రమ వెచ్చించి నేర్చుకొనేందుకు ఏదో ఒక incentive కావాలి. అవి ఆర్థిక కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, బలమైన కారణం ఉండడం ముఖ్యం. అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు. అందుకోసమే తమ తమ సాహిత్యాన్ని రక్షించుకోవడం సమాజాలకు ముఖ్యం.

అనునిత్యం భాషలకోసం పరిశ్రమించే ఒక విద్యావేత్తతో కొంతసేపు మాట్లాడడం మనసును తేలిక పరచింది. కానీ ఆయన మాటల్లో భాషల భవితవ్యం గురించి ఒక ఆశావహ దృక్పథం కనిపించక పోవడం కొంత నిరాశను కలిగించింది.

తరువాత, అక్కడే క్లాసికల్ తెలుగు విభాగాన్ని చూస్తున్న శ్రీ కందాళం శ్రీనివాసాచార్య గారిని కలిసి మాట్లాడాను. తమిళ విభాగాధిపతి శ్రీ తొల్కాప్పియన్ గారిని కూడా కలుసుకొన్నాను. ఆ సంభాషణలు కూడా భాషల భవితవ్యం పట్ల ఆశను కలిగించేలా లేవు.

అలా నా రోజంతా భాషలమధ్య గడిచింది.

మమ్మల్నలా వదిలేయండి!

2009 మే 24

ఈ పోస్టు నిజానికి ‘బ్లాగాడిస్తా ‘ బ్లాగులో రవి గారు వ్రాసిన టపాకు వ్యాఖ్య వ్రాయాలని మొదలైంది. రవి గారి  టపా తాడేపల్లి వారు వ్రాసిన టపాకు విమర్శ. కాని విషయ విస్తారం  వలన కామెంటు అసలు పోస్టుకంటే పెద్దదైపోయినట్లనిపించి  దాన్ని విడిగా ఇక్కడ  ప్రచురించాను. ఆ పై టపాలు రెండూ చదివితే గాని ఈ టపా అర్థం కాదు. “>> <<” ఈ గుర్తుల మధ్య వాక్యాలు రవిగారి టపాలోనివి.

చల్లారిపోయిందనుకొన్న వివాదం మళ్ళీ పైకొచ్చింది! మీరు ఈ పోస్టు వ్రాసిన నేపథ్యాన్ని బట్టి మీ ఆవేశం నాకు అర్థమయ్యింది. కానీ ఆ ఆవేశంలో మీరు తమిళ దురభిమానం గురించి కొన్ని మూస (Stereotyped) అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కామెంటకూడదనుకొన్నా వ్యాఖ్యల్లో కూడా ఈ దురభిమానం గురించి దురభిప్రాయాలు వ్యక్తమవడం చూశాక కొన్ని వివరణలు అవసరమనిపించి వ్రాస్తున్నాను. మీ టపాలోని మూల విషయానికి సంబంధించి నాకేమీ అభిప్రాయ భేదం లేదని గమనించగలరు.

.
>>కొన్ని నెలల క్రితం ఈనాడు ఆదివారం అనుబంధంలో…ఉన్నది అభిమానం. ఆ అభిమానం మనసుకు సంబంధించినది!<<

మీరు మరోసారి ఆ వ్యాసం చదవండి. నిజంగా వాళ్ళు భాషాభిమానంతో తెలుగు మాట్లాడుతున్నారా? వారు శ్రీలంకలో అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ఎలుకల్ని తింటూ, పాములు ఆడించుకొంటూ ఉండడానికి ఇల్లు లేక ఊరూరూ తిరుగుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు మాట్లాడే భాషని తెలుగంటారని కూడా వారికి తెలియదు.శ్రీలంక జనాభా లెక్కల్లో కూడా వీరిని తెలుగు వారని గుర్తించలేదు. ఏదో గిరిజన భాష మాట్లాడే  Nomadic tribe కింద లెక్కగట్టారు. ఏ భాష మాట్లాడుతున్నామో ఆ వ్యాసకర్త చెప్పేదాకా తెలియని ఆ భాషాభిమానం తమిళుల భాషాభిమానానికి భిన్నమైనదని నా ఉద్దేశ్యం.

చెన్నైలోనూ, తంజావూరు జిల్లా లోనూ, కోయంబత్తూరు లోనూ తెలుగు మాట్లాడే వాళ్ళుండడం చాలా సాధారణమైన విషయం. వారా భాష మాట్లాడకుండా కట్టడి చేసినవారెవరూ లేరు. కనుక వారికే ఉద్యమమూ అవసరం కాలేదు. మదురై నగరంలో వేలాది సౌరాష్ట్రీయుల కుటుంబాలున్నాయి. ఏ కాలంలోనో గుజరాత్ లోని కఛ్ ప్రాంతంనుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారు సౌరాష్ట్ర భాష మాట్లాడుతారు. తమిళ సాంస్కృతిక రాజధాని ఐన మదురైలో వారు శతాబ్దాలుగా వారి భాష మాట్లాడుతూ నిశ్చింతగా బ్రతుకుతున్నారు. వారిని సౌరాష్ట్ర భాష మాట్లాడవద్దని ఎవరూ అనలేదు. తన  తల్లిని గౌరవించేవాడే ఎదుటి వాడి తల్లిని గౌరవించ గలడు. తమ భాషను ప్రాణంగా భావించే తమిళులు ఇతర భాషలను కూడా అలాగే గౌరవించారు.

>>ఈ ఆధునికులు, పైగాపొద్దస్తమానం పాశ్చాత్య సంస్కృతిలో, పాశ్చాత్య భాషలో వ్యవహారం సాగించే వాళ్ళు… ఇది ఏ ఉద్యమం తాలూకు ఫలితం?<<

ఇంటర్నెట్లో ఉత్తర భారతీయుల జులుం, అవహేళనలు సహించలేక తెలుగు యూజర్నెట్ గ్రూపు స్థాపనకు ఎంత  పోరాటం  జరిగిందో, ఎంత పెద్ద ఉద్యమం నడిచిందో ‘ఈమాట’ ఎడిటర్ సురేష్ కొలిచాల గారి స్మృతులు ఈ లంకెలో చదవండి. భారతీయ భాషల్లో యూజర్ నెట్ మొదటగా తెలుగు, తమిళ భాషల్లోనే ప్రారంభమయ్యాయని ఆయన వ్రాశారు.

ఏ ఉద్యమం నడవకుండా భాష బ్రతకదన్న విషయం గ్రహించాలి. గిడుగు వారి వ్యవహారిక భాషోద్యమం లేకుంటే బహుశ ఇప్పుడు తెలుగు సాహిత్యం రిఫరెన్సు లైబ్రరీల్లో మాత్రమే ఉండేది కాదా!

>>శ్రీలంక విషయం వచ్చినప్పుడల్లా, “శ్రీలంక భారతీయులు” అన్న పదం వినిపించదు. బహుశా శ్రీలంక తమిళులు తాము “భారతీయులు” అని చెప్పుకోవటం సిగ్గుచేటని భావిస్తారో ఏమో?<<

నిస్సందేహంగా! శ్రీలంక పౌరులు తమను భారతీయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? శ్రీలంక తమిళులను ఇతర ప్రవాస భారతీయులతో పోల్చి మీరే పొరబడ్డారు. మీరనుకుంటున్నట్లు  వారు భారతపౌరులు కాదు. భారత పౌరసత్వమూ వారు కోరుకోవడం లేదు. వారు కోరేది తమ దేశం (శ్రీలంక)లో తమకు సమాన హక్కులు కావాలని మాత్రమే. వారు భారతపౌరసత్వమే కోరుకొనివుంటే ఇంత పోరాటం ఎందుకు. అందరూ తమిళనాడుకు వచ్చేయక పోయారా! బాంగ్లాదేశీయులనే రానిస్తున్న మనం వారిని అడ్డుకొంటామా?

శ్రీలంక పొమ్మంటే పోవడానికి వారు నిన్నమొన్న   కోబాల్ నేర్చుకొని  H1B వీసాలపై  వెళ్ళిన ఎన్నరైలు కాదు. వెయ్యి సంవత్సరాల పూర్వం రాజ రాజ చోళుడు  లంకను జయించి చోళ సామ్రాజ్యంలో కలిపేసుకున్నప్పటినుండి తమిళులు అక్కడ నివసిస్తున్నారు.(చూ. -”వికీ పీడియా” ). బ్రిటిష్ వారు తరలించుకొని వెళ్ళిన  తమిళులు దీనికి అదనం. తమ దేశంలోనే సహస్రాబ్దపు చరిత్ర ఉన్న భాషను నాశనం చేయాలనుకోవడం సింహళుల మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వానికి ఫలితమే ఇంత వినాశనం.

>>శ్రీకృష్ణదేవరాయలు. మనకు తెలిసిందే…’మేము ఓ కన్నడిగుని మీద అభిమానం చూపించాం, ఆదరించాం’ అన్నప్రచారం, పటాటోపం, ఆవగింజంత కూడా లేవు<<

ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో గమనించండి. ఆదరించేది ఎవరు? ఆదరణ పొందేది ఎవరు? గజపతులు, బహమనీ, బీజాపూర్ సుల్తానుల రాజ్యాలను వదిలేస్తే మొత్తం దక్షిణ భారతాన్నంతా(ఒరిస్సాతో కలిపి) సర్వం సహాధిపత్యంగా ఏలిన మహాచక్రవర్తి ని ఓ ప్రాంత ప్రజలు ఆదరించారని చెబుతారా లేక అంతటి మహా ప్రభువు  తెలుగువారిని ఆదరించాడని చెబుతారా! చూడబోతే తెలుగువారి దయమీదే రాయలవారు బ్రతికారన్నట్లుంది! ఆయన తెలుగు భాషను అభిమానించి ఆదరించాడు. అదే సమయంలో కన్నడ, తమిళ కవులు కూడా ఆయన ఆస్థానంలో ఉండేవారు. పెద్దనతో సమంగా వారికీ గౌరవాదరాలుండేవి. కన్నడ భాషీయులెవరినైనాఅడిగి చూడండి- రాయలు మావాడంటారో మీవాడంటారో. ఆయన ‘ఆంధ్ర భోజుడు’ మాత్రమే కాదు. ‘మూరు రాయర గండ’ కూడా.ఆయనను తెలుగువాళ్ళు ఆదరించడం కాదు, ఆయనే తెలుగువారిని ఆదరించాడు.

>>>ఓ పద్ధతి ప్రకారం తమిళులు కన్నడ రాజధానిలో వేళ్ళూనుకున్నారనిపిస్తుంది. ఇక్కడ ఏ (ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు) సంస్థలో అయినా, మేనేజర్లు అధికశాతం తమిళులు. వీళ్ళందరూ, నిజాయితీగా, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళేనా? … … … <<<

మీనుండి ఇంత  Biased వాదనను ఊహించలేదు నేను. బహుశ మీ స్వీయానుభవాలేవో ఇలాంటి దురభిప్రాయాన్ని కలిగించాయనుకొంటాను. కొంచెం కూల్ గా అలోచిస్తే మీ వాదనన వితండ వాదమని మీకే అనిపిస్తుంది. పనిచేయని తమిళులను టోకున ఉద్యోగాల్లో చేర్చుకొని ప్రమోషన్లిస్తూ  ఉండేంత లగ్జరీ ఈనాడు ఏ సంస్థకైనా (ప్రభుత్వ/ప్రైవేటు)ఉందనుకోను. నేనూ ఓ ప్రభుత్వ సంస్థలోనే పనిచేస్తున్నాను. నా భాషకారణంగా ఇంతవరకు ఒక్క ప్రయోజనమైనా కలుగలేదు నాకు- ఎందరో తమిళ బాసులక్రింద పనిచేసినా. కనీసం తమిళనాడుకు బదిలీ ఐనా ఇవ్వలేదు గత 14 ఏళ్ళుగా ఎంత అడిగినా (మీ టపా చూపించాలి వారికి – “చూడండ్రా మన ఐకమత్యం గురించి వాళ్ళెంత చెబుతున్నారో! కనీసం వారి మాట నిజం చేయడం కోసమైనా నాకు చెన్నైకి బదిలీ ఇవ్వండ్రా..” అని చెప్పాలి. ఏమైనా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం ;-) ).

మీరు బెంగళూరులోనే ఉన్నారు కదా, ఒక సారి చుట్టుపట్ల విచారించి చూడండి. ఏ జాతీయులు ఎలా ఉన్నారో. తమిళులు మీరన్నట్లు ఉద్యోగాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నారు. సగం బెంగళూరు నగరాన్ని రియల్ ఎస్టేట్ భూముల కింద కొనేసిందెవరో, బెంగళూరులో పెద్ద పెద్ద హోటళ్ళు ఎవరివో, రాజకీయాలు చేసేది ఎవరో, బెంగళూరు నగరంలో పెద్ద పెద్ద సివిల్ కాంట్రాక్టులు చేసేది ఎవరో ఒకసారి పరిశీలించండి. జగన్ బాబు మొదలుకొని మాచిత్తూరు జిల్లా రాజులు, నాయుళ్ళ వరకు అందరూ తెలుగు వాళ్ళే సార్! చాలా మంది తెలుగు మాట్లాడక పోవచ్చు. ఎందుకంటే మనకు బతుకు ముఖ్యం, భాషకాదు. తెలుగంటూ కూర్చుంటే కాసులు రాలవు. కర్ణాటక అసెంబ్లీలో తెలుగు మంత్రులెందరో , తమిళులెవరైనా ఉన్నారో ఒకసారి కనుక్కోండి. బెంగళూరులో ఒక పథకం ప్రకారం రాజకీయాలు చేస్తూ  పాతుకుపోయిందెవరో మీకే తెలుస్తుంది. బెంగళూరులో తమిళులు ఒక్కచోట ఉండడానికీ, వారి ఆవాసాల్లో ఇతరులను చేర్చకపోవడానికీ గల చారిత్రిక కారణాలు బహుశ మీకు తెలియవు. కావేరీ గొడవలప్పుడు ఇళ్ళు, వాకిళ్ళి వదిలేసి ప్రాణాలరచేత పట్టుకొని పారిపోయి వచ్చిన మా బంధువులు నాకు తెలుసు. కన్నడిగుల చేత మానభంగం కావింపబడి ఆత్మహత్యలు చేసుకొన్న తమిళ స్త్రీల కథలు నాకు తెలుసు. అంతెందుకు, నేను మైసూరు వచ్చిన కొత్తలో కావేరి అల్లర్లు జరిగాయి( సుప్రీం కోర్టు తీర్పు తరువాత). అప్పుడు మా ఇంటి ఓనరు (వాళ్ళు సింధీలు) మాకు సలహా ఇచ్చాడు.” మీరు తమిళులమని చెప్పుకోకండి. ఈ మండ్యా జనాలు మంచివాళ్ళు కాదు” అని. ‘వీళ్ళకు భయపడి రోజూ చస్తామా, ఠాట్ ‘ అని నేను పట్టించుకోలేదనుకోండి. అందరితో తమిళుణ్ణనే చెబుతాను. కానీ పిల్లలను వెంటేసుకుతిరిగే మా ఆవిడ పాపం అంత ధైర్యం చేయలేక పోయింది. తను అందరితో తెలుగువాళ్ళమని చెప్పుకుంటుంది. ఇంత అల్లర్లలోనూ తమిళనాడులో ఒక్క కన్నడ స్త్రీకైనా అవమానంజరిగిందని ఎవరినైనా చెప్పమనండి! భయపడుతూ బ్రతికేవారిని భయపెట్టే వారెందరో. సుబ్రహ్మణ్య భారతి  ఇలా నినదించాడు :

“అచ్చమిల్లై  అచ్చమిల్లై  అచ్చమెన్బదిల్లయే
ఇజ్జగత్తుళోరెల్లాం ఎదిర్తు నిన్డ్ర పోదిలుం
అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే”

(భయంలేదు .. భయంలేదు.. భయమన్నదె లేదులే
ఈ జగాన జనులెల్లరు ఎదురించి  నిలిచినప్పుడూ
భయం లేదు.. భయంలేదు.. భయమన్నదె లేదులే)

తన భాషకోసం, తన సంస్కృతికోసం ఎదురొడ్డి నిలిచిన ప్రతి తమిళుడి గుండెలోనూ స్ఫూర్తిని నిలిపేది పై మాటలే. తమను ద్వేషంతో చూసే జనులమధ్య బ్రతుకు తెరువుకై వచ్చి నివసిస్తున్నా తన భాషను, తన సంస్కృతిని మరచిపోకుండా, భయంతోనో, ధనార్జనకోసమో, ఇతర లాభాలకోసమో తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తలెత్తుకొని తిరిగే ప్రతి తమిళుడి గుండెలోనూ పై గీతం ప్రతిధ్వనిస్తుంది. అది బెంగుళూరైనా, బట్టికలోవా అయినా సరే.

>>ఇంత పెద్ద దేశంలో ఒక్క తమిళ నాడులో తప్ప, మరెక్కడా, తమ మాతృ దేశంలో అత్యధికులు మాట్లాడే హిందీ భాషపై తీవ్ర అసహనమూ, ఏవగింపూ కనబడదు.<<

నిజమా! మరైతే దక్షిణ భారత హిందీ ప్రచార సభ  కార్యాలయం చెన్నైలో ఎందుకుంది? సురక్షితమైన హైదరాబాద్ కు ఎప్పుడో తరలి పోవలసింది కదా? హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎప్పుడైనా ఆ కార్యాలయం మీద దాడి జరినట్లు గాని, దాన్ని తరలించాలని డిమాండు చేసినట్లు గానీ విన్నారా? తమిళుల వ్యతిరేకత భాషపై కాదు. భాషను దౌర్జన్యంగా రుద్దడం పైన. నేను ముందే చెప్పినట్లు తల్లిని గౌరవించేవాడు పరమాతను అగౌరవ పరచలేడు. తమిళులు ఎప్పుడూ ఇతర భాషలను చులకన చేయరు. భారతియార్ అంతటి మహాకవి కూడా పాట పాడితే సుందరమైన తెలుగు భాషలోనే పాడాలని ప్రశంసించాడు.

త్రిభాషా సూత్రాన్ని తుంగలో తొక్కి, కేంద్రం ఇక్కడ హిందీని రుద్దుతూ, ఉత్తర భారతంలో రెండు భాషలనే నేర్పుతూ, దక్షిణాది భాషలను ఒక పథకం ప్రకారం అణగదొక్కే కుటిల నీతికి వ్యతిరేకంగా మాత్రమే తమిళులు పోరాడుతున్నారు. చేతనైతే చేయి కలపండి. మన భాషా సంస్కృతులను నిలబెట్టుకొందాం రండి. లేదంటారా తమిళులను వారి మానాన వారిని వదిలేయండి. ఒకరు వారి తో పోల్చడం ఎందుకు? ఇతరులు దాన్ని తెగడుతూ పన్లో పనిగా తమిళులపై అభాండాలు వేయడం ఎందుకు? మన గీతను పెద్దది చేయడం కోసం పక్క గీత ను చిన్నది చేయడం తెలివైన పనే, కానీ సరియైన పని కాదు. తెలుగు వారి రాజీ ధోరణే ఉన్నతమైందని అందరూ అంగీకరిస్తే అందులో అభ్యంతరపెట్టవలసిందేదీ లేదు. కానీ అందుకోసం మమ్మల్నీ , మా భాషాభిమానాన్ని (మీ భాషలో దురభిమానం) కించ పరచకండి. మా భాష మాకు ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోలేరు. భారతిదాసన్ తన కవితలో అంటాడు:

“తమిழுక్కు అముదెండ్రు పేర్
అంద తమిழ் ఇన్బ త్తమిழ் ఎంగళ్ ఉయిరుక్కు నేర్
తమిழுక్కు నిలవెండ్రుమ్ పేర్
ఇన్బత్తమిழ் ఎంగళ్  సమూగత్తిన్ విళైవుక్కు నీర్…”

( తమిళానికి అమృతమని పేరు,
ఆ తమిళం, ఆ తీయని తమిళం, మాకు ప్రాణంతో సమానం.
తమిళానికి వెన్నెలనీ పేరు.
ఆ తీయని తమిళమే  మా తమిళజాతి అనే పంటకు నీరు)

మా భాష మాకు ప్రాణం, మా సంస్కృతికి జీవం. దానికి ఎవరు హాని తలపెట్టినా ఓర్చుకోలేనితనం మా జీన్సు లో ప్రోగ్రాం అయిపోయింది. మమ్మల్నలా వదిలేయండి.